Thursday, 28 June 2018

మే 2018 వ్యక్తులు

ఆసారాం బాపుకు జీవిత ఖైదు పదహారేళ్ల బాలికపై అత్యాచారం కేసులో స్వామీజీ ఆసారాం బాపు (77)కు జోధ్‌పూర్ ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2013లో ఓ మైనర్ బాలిక తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేయడంతో ఆసారాం జోధ్‌పూర్ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. 
ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న సింధ్ ప్రావిన్సులోని బెరానీ గ్రామంలో 1941, ఏప్రిల్ 17న జన్మించిన ఆసారాం అసలు పేరు అసుమల్ తౌమల్ హర్‌పలాని. 1947లో దేశ విభజన తర్వాత ఆసారాం కుటుంబం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వలసవచ్చింది. నాలుగో తరగతి వరకు చదువుకున్న ఆసారాం గుజరాత్‌లోని మొతెరాలో సబర్మతి నదీతీరాన ‘మోక్ష కుటీర్’ పేరుతో చిన్న ఆశ్రమాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసారంకు 400 ఆశ్రమాలు, రెండు కోట్ల మంది అనుచరులు రూ.10,000 కోట్ల సంపద ఉంది.


మై జర్నీ ఫ్రమ్ మార్క్సిజం టు సోషలిజం పుస్తకావిష్కరణ ప్రపంచ వ్యాప్తంగా సమకాలీన మార్పులను గుర్తించి అందుకనుగుణంగా ప్రజలు కూడా మారాల్సిన అవసరం ఉందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 26న ఆర్థికవేత్త ప్రొ.సీహెచ్ హనుమంతరావు రాసిన ‘మై జర్నీ ఫ్రమ్ మార్క్సిజం-లెనినిజం టు నెహ్రూవియన్ సోషలిజం: సమ్ మెమోరీస్, రిఫ్లెక్షన్స్ ఆన్ ఇంక్లూజివ్ గ్రోత్’ పుస్తకావిష్కరణ సభలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

ఇందూ మల్హోత్రా నియామకానికి కేంద్రం ఆమోదం 
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా నియామకానికి కేంద్రం ఏప్రిల్ 26న ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టుకు ఒక మహిళా న్యాయవాది నేరుగా ఎంపికవడం ఇదే మొదటిసారి. 1989లో జస్టిస్ ఫాతిమా బీవీ సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం జస్టిస్ ఆర్.భానుమతి మాత్రమే సుప్రీంలో మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. 
అదే విధంగా ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్(59)ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న కొలీజియం సిఫార్సుల్ని కేంద్రం తిప్పిపంపుతూ వాటిని పునఃపరిశీలించాలని కోరింది.
 

కిలిమంజారోని అధిరోహించిన ఏడేళ్ల బాలుడు 
ఆఫ్రికాలోని కిలిమంజారో (5,380 మీటర్లు) పర్వతాన్ని ఏడేళ్ల సమన్యు యాదవ్ ఏప్రిల్ 2న అధిరోహించాడు. దీంతో ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా గిన్నిస్‌బుక్ రికార్డు నెలకొల్పాడు. అమెరికాకు చెందిన క్యాష్ అనే బాలుడి పేరిట ఉన్న ఈ రికార్డును మూడో తరగతి చదువుతున్న సమన్యు అధిగమించాడు. కర్నూలుకి చెందిన సమన్యు ఇప్పటికే మౌంట్ ఎవరెస్ట్‌ను కూడా అధిరోహించాడు.


సీపీఐ ప్రధాన కార్యదర్శిగా సుధాకర్ రెడ్డి 
సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్ రెడ్డి వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. కేరళలోని కొల్లాంలో ఏపిల్ 29న పార్టీ 23వ ప్లీనరీ సమావేశాల్లో ప్రధాన కార్యదర్శితో పాటు 126 మంది సభ్యుల జాతీయ మండలి, 11 మందితో కూడిన సెక్రటేరియట్, 11 మంది సభ్యులు గల కంట్రోల్ మిషన్‌ను ఎన్నుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్‌కు జాతీయ మండలిలో చోటు దక్కింది. తెలంగాణలోని నల్గొండ నియోజక వర్గం నుంచి రెండు సార్లు (1998-99, 2004-09) లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన సుధాకర్ రెడ్డి 2012లో తొలిసారి సీపీఐ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 


మత్స్యకార సంఘం అధ్యక్షుడు బాబూరావు కన్నుమూత 
మత్స్యకార సంఘం జాతీయ అధ్యక్షుడు రేవు బాబూరావు(77) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ 28న విశాఖపట్నంలో తుది శ్వాస విడిచారు. బాబూరావు కనకమహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంక్ డెరైక్టర్‌గా కూడా ఉన్నారు. ఆయన భార్య రేవు రత్నకూమారి గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు.

సుదీర్ఘ కాలం కొనసాగిన సీఎంగా చామ్లింగ్ 
సుదీర్ఘ కాలం కొనసాగిన సీఎంగా సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ ఏప్రిల్ 28న రికార్డు సృష్టించారు. 1994 డిసెంబర్ 12న తొలిసారి సిక్కిం ముఖ్యమంత్రిగా చామ్లింగ్ ఎన్నికయ్యారు. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్‌డీఎఫ్)ని వరుసగా ఐదుస్లారు(1994, 1999, 2004, 2009, 2014) అధికారంలోకి తీసుకొచ్చారు. ఇంతకు ముందు ఈ ఘనత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు పేరిట ఉంది. బసు 1977 జూన్ 21 నుంచి 2000 నవంబర్ 6 వరకు( 23 ఏళ్లకు పైనే- 8,540 రోజులు) ఐదుసార్లు పశ్చిమబెంగాల్ సీఎంగా పనిచేశారు.


ఐఆర్‌డీఏ చైర్మన్‌గా సుభాష్ చంద్ర 
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర కుంతియా నియమితులయ్యారు. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) మే 1న ఉత్తర్వులు జారీ చేసింది. 1981 బ్యాచ్‌కు చెందిన కర్ణాటక కేడర్ అధికారి సుభాష్ చంద్ర గతంలో కర్ణాటక ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఐఆర్‌డీఏ చైర్మన్‌గా ఐదేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించిన టి.ఎస్.విజయన్ ఫిబ్రవరిలో పదవీ విరమణ చేశారు. 


పీఏసీ చైర్మన్‌గా మల్లిఖార్జున ఖర్గే 
పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) అధ్యక్షునిగా లోక్‌సభ కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మే 2న ప్రకటించారు. 22 మంది సభ్యులు గల ఈ కమిటీ ప్రభుత్వ ఖర్చులు పార్లమెంట్ కేటాయింపులకు అనుగుణంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తుంది. అంచనాల కమిటీకి బీజేపీ నేత మురళీ మనోహర్ జోషీని, పబ్లిక్ అండర్‌టేకింగ్‌‌స కమిటీకి శాంతకుమార్‌ను చైర్మన్‌గా నియమించారు. ఈ కమిటీటు ఏడాదిపాటు కొనసాగుతాయి.


ఆర్థిక వేత్త అశోక్ మిత్రా కన్నుమూత ప్రముఖ ఆర్థిక వేత్త అశోక్ మిత్రా (90) అనారోగ్యంతో మే 2న కన్నుమూశారు. మిత్రా ఇందిరా గాంధీ ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేశారు. జ్యోతిబసు పశ్చిమబెంగాల్ సీఎంగా ఉన్నప్పుడు పదేళ్లు ఆర్థికమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సాహిత్య రంగానికి చేసిన కృషికిగాను మిత్రాకి సాహిత్య అకాడమి పురస్కారం దక్కింది.



No comments:

Post a Comment